దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ కస్టడీలో ప్రధాన నిందితురాలిగా ఉన్న కవితను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న కవిత రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ.. రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో, పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. మరి కవిత కేసులో తదుపరి మలుపు ఎంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.