లోక్‌సభ పోల్.. మొదటి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్ విడుదల

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 08:31 AM

 లోక్‌సభ పోల్..  మొదటి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఇటు రాజకీయ వర్గాలు, అటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024కు సంబంధించి కీలకమైన అంకానికి ఈ రోజు తెరలేవనుంది. ఏడు దశల్లో తొలి విడత పోలింగ్‌కు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుంది. ఈసీ జారీ చేసే నోటిఫికేషన్‌తో తొలి దశలో 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలు చొప్పున, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్లు చొప్పున, ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది.

నేడు విడుదల కానున్న నోటిఫికేషన్‌తో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి విడతకు సంబంధించి నామినేషన్ల సమర్ఫణకు ఈ నెల 27 తుది గడువుగా ఉంది. నామినేషన్లను 28న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 చివరి తేదీగా ఉంది. ఈ మేరకు పలు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి.





Untitled Document
Advertisements