‘ఆప్‌’ పార్టీకి నాయకత్వ లేమి.. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభం!

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 08:40 AM

‘ఆప్‌’ పార్టీకి నాయకత్వ లేమి.. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభం!

నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుతో పార్టీలో నాయకత్వ లేమి ఏర్పడింది. ఆయన లేని సమయంలో ఆప్‌ను ముందుండి నడిపించేదెవరు అనే ప్రశ్న పార్టీ వర్గాలను వేధిస్తోంది. అయితే, కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఢిల్లీ కేబినెట్ మంత్రులు, కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆతిషీ, సౌరభ భరద్వాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ముందుండి నడిపించే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్టీ ముందున్న ప్రధాన సవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
2012లో ఆప్ ప్రారంభమైన నాటి నుంచీ కేజ్రీవాల్ పార్టీకి ముఖచిత్రంగా మారారు. పార్టీ కన్వీనర్‌గా, దాదాపు దశాబ్దకాలంలో మూడు సార్లు సీఎంగా సేవలందించిన కేజ్రీవాల్ స్థాయి వ్యక్తిని ఎంపిక చేయడం పెద్ద సవాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌తో పాటు గుజరాత్, అస్సాం, హర్యానాలో కూడా బరిలోకి దిగనుంది. ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్‌యే ప్రధాన కాంపెయినర్‌గా మారారు.
ఇక, కేజ్రీవాల్‌కు నమ్మకస్తురాలిగా ఉన్న కేబినెట్ మంత్రి ఆతిషీ ప్రభుత్వంలో అత్యధిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, పీడబ్ల్యూడీ, రెవెన్యూ శాఖలతో సహా ఇతర డిపార్ట్‌‌మెంట్‌ల బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ ప్రతినిధిగా కూడా మీడియా సమావేశాల్లో బీజేపీపై విరుచుకుపడుతుంటారు.
పార్టీలో మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోగ్యం, అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖల్ని నిర్వహిస్తున్నారు. పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేస్తూ పార్టీని వెనకేసుకొచ్చారు. ఇక కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునీత పేరును కూడా పార్టీ వర్గాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి.
అయితే, పార్టీ నాయకత్వానికి సంబంధించి ఆప్ గతంలోనే ఓ క్యాంపెయిన్ నిర్వహించింది. ‘మే భీ కేజ్రీవాల్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో.. కేజ్రీవాల్ అరెస్టయితే పార్టీ బాధ్యతలు ఎవరు చూడాలనే దానిపై అభిప్రాయసేకరణ జరిపింది. ఆ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ల సూచనలు కూడా కేజ్రీవాల్ తీసుకున్నారు. అయితే, ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను కేజ్రీవాల్ ఎక్కడి నుంచైనా నిర్వహించొచ్చని ఆ క్యాంపెయిన్‌లో పాల్గొన్న 90 శాతం మంది అన్నట్టు ఇటీవలే మంత్రి భరద్వాజ్ తెలిపారు. ప్రజల మద్దతు కేజ్రీవాల్‌కు ఉన్నట్టు సుస్పష్టమైందని అన్నారు. మరోవైపు, పంజాబ్, గోవా, గుజరాత్‌లలోనూ పార్టీని ముందుండి నాయకులను ఎన్నుకోవడం ఆప్‌కు కీలకంగా మారింది. పార్టీ ముందున్న ప్రత్యామ్నాయాలు కూడా పరిమితమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల పార్టీ ముందుకు సాగేది ఎలా అనే ప్రశ్న ఆప్ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి.





Untitled Document
Advertisements