గత రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ అధికారుల సమక్షంలో ఉన్నారు. ఆయన అరెస్ట్ తో పార్టీ భవిష్యత్ కార్యచరణ ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీ శ్రేణులు నాయకుడు లేక దిక్కు తోచని స్థితిలో ఉండగా.. కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన మాట వినలేదని మండిపడ్డారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు రూపొందించాడని దుయ్యబట్టారు. తన కర్మలఫలంగానే ఆయన అరెస్టయ్యాడని హజారే వ్యాఖ్యానించారు. అధికారం ముందు ఏదీ పని చేయదన్నారు. అరెస్టు జరిగిందని, చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్.. 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యారు.
మరోవైపు ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. అలాగే ఈ అరెస్టును ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి.