ప్రస్తుతకాలంలో యుక్త వయసులోనే మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. అప్పటివరకు సంతోషంగా ఆడిపాడిన వారు ఉన్నట్టుండి కుప్పకూలి మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. తాజాగా అటువంటి షాకింగ్ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. స్విమ్మింగ్ పూల్లో అప్పటివరకూ ఈత కొట్టి బయటకొచ్చిన మరుక్షణమే టీనేజ్ బాలుడు కుప్పకూలి మరణించాడు. మీరట్లో వెలుగు చూసిన ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడిని శివాల్ఖాస్ వాస్తవ్యుడిగా గుర్తించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, స్విమ్మింగ్ పూల్ బయటకు రాగానే ఆ బాలుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడు పరారీలో ఉండగా ఘటన నేపథ్యంలో అధికారులు దాన్ని మూసేశారు. బాలుడి మృతికి కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.