ఏపీ గత ప్రభుత్వంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ సిద్ధార్థ రెడ్డి.. ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్’ల పేరుతో చేసిన రూ. 100 కోట్ల అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు
ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ) కి ఫిర్యాదు చేశామని ఆర్డీ ప్రసాద్ తెలిపారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్డీఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.