హైదరాబాద్, ఏప్రిల్ 18 : నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నటి మాధవీలత ఈరోజు ఫిలింఛాంబర్ ఎదుట మౌనదీక్ష చేపట్టారు. గత కొద్దిరోజులుగా కాస్టింగ్ కౌచ్ పేరుతో చెలరేగుతున్న వివాదం అందరికి తెలిసిందే. శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. "ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న నీకు అమ్మాయి జాతిమీద విలువుందా.? నిన్ను అన్నా అన్నందుకు నన్ను నేను అవమానపరుచుకున్నా ..!" అంటూ తారాస్థాయిలో విమర్శించింది.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా మాధవీలత తన ట్విట్టర్ లో క్యాస్టింగ్ కౌచ్పై వివాదానికి సంబంధం లేని పవన్పై శ్రీరెడ్డి సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసిందంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఫిలింఛాంబర్ ఎదుట మౌనదీక్ష చేస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే నేటి ఉదయం ఛాంబర్ వద్దకు చేరుకుని దీక్ష చేపట్టారు. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అయినా మాధవీలత మాత్రం ఎవరు వచ్చినా.. రాకున్నా అక్కడే దీక్ష మాత్రం కొనసాగిస్తానని పేర్కొన్నారు.