హైదరాబాద్, ఏప్రిల్ 18 : బాహుబలితో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శక దిగ్గజం రాజమౌళి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన 'ఆర్ ఆర్ ఆర్' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట.
ఈ సినిమా బడ్జెట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించారు. “ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాం. సెట్స్ కోసం మా ఆర్ట్ డైరెక్టర్ తన పని మొదలు పెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నుల పండుగగా ఉండబోతోంది. మా బ్యానర్ అయిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ లోనే దీన్ని నిర్మిస్తున్నాం” అని తెలిపారు.
ఈగ సినిమాకి కథ ముందుగానే చెప్పి స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు రాజమౌళి. బాహుబలి మొదటి భాగం తర్వాత 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే ప్రశ్న ప్రేక్షకుల ఊహకి వదిలేసి ఉత్సుకత పెంచాడు. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో విధమైన ఆసక్తిని రేకెత్తించే ఈ దర్శక ధీరుడు.. ఈసారి ఇద్దరు అగ్ర కథానాయకులతో చేస్తున్న ఈ చిత్రంతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో తెలియాలంటే ఇంకో ఏడాది వేచి చూడాల్సిందే.