బెంగుళూరు, ఏప్రిల్ 22 : ఐపీఎల్ -11 సీజన్ ల్లో వెటరన్ ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తున్నారు. కుర్రాళ్ళకు ఏ మాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. గేల్, వాట్సన్ ఆయా జట్టుల తరుపున శతకాలు సాధించగా.. నిన్న బెంగుళూరు మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్(90, నాటౌట్) తనదైన శైలిలో రెచ్చిపోయాడు. నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు- ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో.. 'మిస్టర్ 360 ' రాణించడంతో బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత టాస్ నెగ్గిన బెంగుళూరు సారథి కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట ఢిల్లీ డేర్డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (85), శ్రేయస్ అయ్యర్ (52) చెలరేగి ఆడారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగుళూరు జట్టు లో కోహ్లి (30) ఆడగా.. మరో వైపు డివిలియర్స్ ఢిల్లీ బౌలర్లను తుత్తునియలు చేశాడు.
ఒక దశలో ఏబీ సెంచరీ చేసేలా కన్పించిన.. అండర్సన్ (15), మన్దీప్ (17 నాటౌట్) ధాటిగా ఆడటంతో చేయాల్సిన పరుగులు తగ్గిపోయాయి. దీంతో 175 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును ఏబీడీ దక్కించుకొన్నాడు.