బ్రిస్టల్, జూలై 10 : టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను తోటి ఆటగాళ్లు, ఫ్యాన్స్ 'హిట్మ్యాన్' అని ముద్దుగా పిలుస్తారు. అయితే ఈ పేరంటే తనకు ఎంతో ఇష్టమని రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం కోహ్లి నాయకత్వంలోని భారత్ ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ మేరకు జరిగిన టీ-20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో రోహిత్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
"నన్ను చాలా మంది ‘హిట్మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. నిజానికి ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. టీ20ల్లో ఇప్పటి వరకు నేను మూడు సెంచరీలు సాధించాను. ఈ మూడు నాకెంతో ప్రత్యేకం. ఏ ఒక్కటి మరో దాని కంటే గొప్పదని చెప్పలేను. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధించాలి" అని రోహిత్ వ్యాఖ్యానించాడు. కాగా గురువారం నుంచి ఇంగ్లాండ్తో భారత్ మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది.