ఆక్లాండ్, ఫిబ్రవరి 08: టీం ఇండియా ఓపెనర్, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ మధ్యే 200 వన్డేలు ఆడిన క్రికెటర్ గా ఘనత సాధించిన రోహిత్ నేడు న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో మరో ఘనతకు తెరతీశాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న టీ-20 మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్..36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్టిన్ గప్టిల్ను వెనక్కినెట్టి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్సమెన్గా నిలిచాడు.
అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో తొలి స్థానంలో గప్టిల్( 2272), రెండో స్థానంలో షోయబ్ మాలిక్(2263)లు ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ 92 టి20ల్లో మొత్తం 2288 పరుగులు చేసి మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో టి20లో రోహిత్ కేవలం 29 బంతుల్లో 4 సిక్స్లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు.