హుందాయ్ కార్ల ధరలను జనవరి నుండి పెంచుతున్నట్టు మోటార్ హుందాయ్ ఇండియా ప్రకటించింది. ఖర్చులు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. అయితే ధరలు ఎంత పెరుగుతాయో చెప్పలేదు. వివిధ మోడల్స్, ఇంధన రకాలను ఆధారంగా పెరుగుదల మారుతుందని సంస్థ తెలిపింది. హుందాయ్కు ముందు మారుతి సుజుకి, టాటా మోటార్స్ కూడా జనవరి నుంచి ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. ద్విచక్ర వాహన సంస్థ హీరోమోటోకార్ప్ కూడా సోమవారం జనవరి 1 నుంచి మోటారు సైకిళ్ళు, స్కూటర్ల ధరను రూ .2,000 పెంచనున్నట్లు తెలిపింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) మంగళవారం ఆటో అమ్మకాల గణాంకాలను విడుదల చేశారు. కార్ల అమ్మకాలు 10.83% తగ్గాయి. గత నెలలో 1,60,306 కార్లు సేల్ కాగా, గత ఏడాది నవంబర్లో 1,79,783 యూనిట్లు అమ్ముడయ్యాయి. మోటారు సైకిళ్ల అమ్మకాలు 14.87% తగ్గాయి. గత నెలలో 8,93,538 యూనిట్లు, 2018 నవంబర్లో ఈ సంఖ్య 10,49,651 యూనిట్లుగా ఉంది.