వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని యువకుడిపై దాడి

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 12:08 PM

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని యువకుడిపై దాడి

బియ్యం పంపిణీలో చెలరేగిన వివాదం ఓ యువకుడిపై దాడికి దారితీసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని శ్రీరాంనగర్‌లో జరిగింది. బియ్యం పంపిణీ ఫొటోను వాట్సాప్‌లో పోస్టు చేసి సర్పంచ్‌ పేరు పెట్టలేదన్న ఆక్రోశంతో అతడి అనుచరులు యువకుడిని చితకబాదారు. శ్రీరాంనగర్‌ గ్రామానికి చెందిన కౌకుంట మల్లేష్‌గౌడ్‌ అనే యువకుడు శనివారం గ్రామంలో బియ్యం పంపిణీ చేసిన ఫొటోను గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశాడు. గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బియ్యం పంపిణీ చేస్తున్నాడని రైటప్‌ కూడా పెట్టాడు. అందులో సర్పంచ్‌ పేరు పెట్టకపోవడంతో సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, అతడి అనుచరులు ఆగ్రహం చెందారు. దీంతో 15మంది సర్పంచ్ అనుచరులు మల్లేష్‌ ఇంటికి వెళ్లి అతడి అన్నను, తల్లిదండ్రులను బెదిరించారు. తరువాత వ్యవసాయ బావి వద్ద ఉన్న మల్లేష్‌ వద్దకు వెళ్లి అతడిని చితకబాదారు. అనంతరం అతడిని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి పేకాట ఆడుతుంటే వచ్చి కొట్టారని బాధితుడితోనే లెటర్‌ రాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీటీసీ సభ్యుడు రాంరెడ్డి వచ్చి వారిని అడ్డుకున్నారు. వెంటనే 100కు డయల్‌ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేష్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో సర్పంచ్‌తో పాటు మరో 15మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





Untitled Document
Advertisements