జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 05:44 PM

జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం

దేశ పౌరులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మధుర ఘడియలు ఆసన్నమయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఘట్టానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం (జనవరి 9) తెలిపింది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరోనా యోధులకు, 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలకు పుణే నుంచి వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

అధికారులతో ప్రధాని మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. వ్యాక్సిన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దేశంలోని 41 నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్లను తరలిస్తున్నారు. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో పాటు 50 ఏళ్ల పైబడిన వారు, అత్యవసరం ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తారు.





Untitled Document
Advertisements