ఢిల్లీ, మే 3 : ఐపీఎల్ టోర్నీ ప్రారంభమై సీజన్ సగం పూర్తయింది. ఇక నుండి సాగే మ్యాచ్ లు రసవత్తరంగా జరగడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్, ఒకసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ ప్లేఆఫ్స్ అర్హత కోసం ప్రతి మ్యాచ్ గెలవాలి. ఈ మూడు జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి.
టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ బుధవారం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' రిషబ్ పంత్ (69; 29 బంతుల్లో 7×4, 5×6) రాణించాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ విజయం మాకెంతో అవసరం. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. మ్యాచ్ ఆరంభం నుంచి ఎలా అయినా గెలుస్తాం అన్న పాజిటివ్ ఆలోచనతోనే ఉన్నాం. టోర్నీలో ఇక ఒక మ్యాచ్ ఓడినా మేము ప్లేఆఫ్స్ రేసులో ఉండబోమని తెలుసు. ఇదే వ్యూహంతో ప్రతి మ్యాచ్ ఆడతాం " అని వెల్లడించాడు.