న్యూఢిల్లీ, మే 4 : మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ప్రచారం చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని సుప్రీంను జనార్దన్రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం తిరస్కరించింది.
ఈ మేరకు బెయిల్ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు దానిని తోసిపుచ్చింది. 'మైనింగ్ కేసు' లో గాలికి సుప్రీంకోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదన్న నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం అందుకు అనుమతించబోమని ఖరాఖండిగా చెప్పింది.