వరంగల్, మే 9: కాంగ్రెస్ పార్టీపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం ఆయన వరంగల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులను రాబందుల్లా వేధిస్తే.. తాము రైతు బంధువుగా ఆదుకుంటున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చుక్కలు చూపిస్తే.. తమ ప్రభుత్వం రైతులకు చెక్కులు పంపిణీ చేస్తోందన్నారు. ఈ ఏడాదంతా కష్టపడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
మరో పదేళ్లపాటు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో 80 మంది ఉంటే.. అందులో 30 మంది తామే ముఖ్యమంత్రి అంటున్నారని ఏద్దేవా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ నేతలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.