విజయవాడ, మే 10: విజయవాడ కొత్త ఆటోనగర్లోని ప్లాస్టిక్ పరిశ్రమలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్లోని గ్రీజు తయారు చేసే పరిశ్రమలో ఉదయం మొదలైన మంటలు క్రమంగా సమీపంలోని అన్ని పరిశ్రమలకు వ్యాపించాయి. కూలర్లు తయారు చేసే పరిశ్రమలోని ప్లాస్టిక్ వస్తులకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. భారీగా ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు 12 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రాణ నష్టం తప్పినప్పటికీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పరిసర ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, అగ్నిమాపకశాఖ డీజీ సత్యనారాయణ జాయింట్ సీపీ కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషనర్ నివాస్ ఘటనాస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంస్థ యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమన్నారు.