బెంగళూరు, మే 17 : ఎన్నో ఉత్కంఠ రాజకీయ పరిణామాల మధ్య నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన విధాన సభకు వెళ్లారు. అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మోడీ మొదటి సారి పార్లమెంటుకు వెళ్లిన రోజును గుర్తు చేసింది. యడ్యూరప్ప శాసన సభలోకి అడుగుపెట్టేముందు కిందకు వంగి భవనం మెట్లను తాకి నమస్కరించారు. అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు.
2014 మేలో పార్లమెంటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విధంగా ప్రవర్తించారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టే ముందు మోదీ పార్లమెంటు భవనం మెట్ల వద్ద కిందకు వంగి తన శిరస్సును మెట్లకు తాకించి నమస్కరించారు. అప్పుడు ఆయన కూడా పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పారు. కాగా అసెంబ్లీలో బీజేపీకు రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప రైతుల రుణాల రద్దు ఫైలుపై తొలి సంతకం చేశారు.