దుబాయ్, మే 17 : క్రికెట్ లో 'టాస్'కు ఉన్నా ప్రాధాన్యత క్రీడాభిమానులకు వేరే చెప్పక్కరలేదు. ముందుగా ఏ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలన్నది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్లలో టాస్ విధానానికి మంగళం పాడాలని ఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో టాస్ విధానం ద్వారా అతిథ్య జట్టుకు లాభం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి.
పిచ్ల ఏర్పాటు అనేది అతిథ్య జట్టు మీదే ఆధారపడి ఉండటంతో టాస్ నెగ్గితే పిచ్ బ్యాటింగ్, బౌలింగ్లలో దేనికి అనుకూలిస్తే వారు దాన్నే ఎంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29 తేదీలలో ముంబైలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేళ జయవర్దనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, థర్డ్ అంపైర్ రిచర్డ్, ఐసీసీ రిఫరీలు రంజన్, షాన్ పొలాక్లు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.