ముంబై, మే 21 : ఈ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ముచ్చటగా మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిని దక్కించుకొన్న ఈ జట్టు ఈ సారి మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది. తద్వారా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అంటేనే పరుగుల సునామీ.. కానీ, రోహిత్ ఈ ఏడాది పరుగులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో కలిపి 286 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ ఒక సీజన్లో 300లోపు పరుగులు సాధించలేకపోవడం ఇదే తొలిసారి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి రోహిత్ శర్మ, సురేశ్ రైనా(చెన్నై సూపర్కింగ్స్) ప్రతి సీజన్లోనూ 300లకు పైగా పరుగులు చేస్తూనే ఉన్నారు. కానీ, ఈ ఏడాది రైనా ఆ ఘనతను అందుకున్నా.. రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు.
టోర్నీలో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో ముంబయి ఇండియన్స్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఎంతో విజయవంతమైన జట్టుగా పేరు సంపాదించుకున్న ముంబయి ఇండియన్స్ అత్యధికంగా మూడు సార్లు ట్రోఫీని ముద్దాడింది. అలాంటి జట్టు ఈ ఏడాది ప్లేఆఫ్కు కూడా అర్హత సాధించకపోవడంతో అభిమానులు ఎంతో నిరాశ చెందుతున్నారు.