గోవా, మే 26 : గోవాలో పెను తుఫాను దూసుకురానుంది. 'మెకును' తుఫానుగా పేర్కొంటున్న దీని ప్రభావంతో దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రతీరం వెంబడి సంరక్షణ కోసం గోవా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ద్రిష్టి మెరైన్ రంగంలోకి దిగింది.
వీరితో పాటు లైఫ్ గార్డ్స్ కూడా సముద్ర తీరం వెంబడి రక్షణ చర్యల్లో పాల్గొన్నారని వెల్లడించింది. ఈ తుఫానును దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఉండాలని.. వారిని సముద్ర తీరం వైపు అనుమతించవద్దని ద్రిష్టి మెరైన్ వెల్లడించింది. మస్కట్లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సముద్రంలో మెకును తుపాను సంభవించింది. ఈ తుపాను గోవా వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది.