వాషింగ్టన్, జూన్ 13 : భారత సైన్యానికి ఆరు అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 930 మిలియన్ డాలర్ల వ్యయం చేసే ఆరు 'ఏహెచ్-64ఈ' అపాచీ అటాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం ఆమోదం కోసం యూఎస్ కాంగ్రెస్కు చేరింది. అయితే ప్రజాప్రతినిధులు ఎవరూ దీనిపై అభ్యంతరాలు తెలపకపోతే ఈ ఒప్పందం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాప్టర్లతోపాటు అత్యాధునిక నైట్ విజన్ సెన్సార్లు, జీపీఎస్ గైడెన్స్, స్ట్రింగర్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు కూడా సమకూరనున్నాయి.
ఈ అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని యూఎస్ ఢిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ పేర్కొంది. ఇండియాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లోనే బొయింగ్, టాటా సంస్థలు కలిసి అపాచీ హెలికాప్టర్కు సంబంధించిన ప్రధాన బాడీని తయారు చేయడం ప్రారంభించినప్పటికీ.. పూర్తిగా తయారుచేసిన హెలికాప్టర్లను అమెరికా నుంచి నేరుగా ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నారు.