చెన్నై, జూన్ 22 : తమిళ అగ్ర కథానాయకుడు అజిత్.. ఇకపై అభిమానులతో ఫోటో దిగను అంటున్నారు. ఇది అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. 'విశ్వాసం' షూటింగ్ ప్రారంభమైన రోజు నుండి అజిత్తో చిత్రబృందం, అభిమానులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అజిత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే.. అజిత్ నటుస్తున్న 'విశ్వాసం' సినిమా కోసమేనట. ఈ సినిమాకు సంబంధించిన కొత్త గెటప్ లు లీకవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో రెండో పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అందులో అజిత్ యువకుడిగా కనిపించబోతున్నారని, ఆ లుక్ లీకవ్వకుండా ఉండాలని అభిమానులతో ఫోటోలు దిగకూడదని అజిత్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే లీకైన ఫోటోల్లో అజిత్ గడ్డం లుక్తో కొంచెం పెద్ద వయస్కుడిగా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే.