హైదరాబాద్, జూన్ 23 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన "మహానటి" చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ పాత్ర పోషించగా దుల్కర్ సల్మాన్, సమ౦త, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రంలో ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య పోషించాడు. సావిత్రి.. ఏఎన్నార్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సైతం ఎంతో ఘన విజయం సాధించాయి. తాజాగా చైతు మరోసారి ఏఎన్నార్ తెరపై కనిపించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ ప్రధాన పాత్రగా 'ఎన్టీఆర్' బయోపిక్ ను క్రిష్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్.. ఏఎన్నార్ కలిసి సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాలో చై కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు క్రిష్ చైతూను సంప్రదించి ఏఎన్నార్ పాత్రను పోషించమని కోరాడట. ఆయన సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా సమాచారం. మరి ఈ విషయంపై చైతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.