విజయవాడ, జూన్ 25 : ఇంద్రకీలాద్రి సివి రెడ్డి ఛారిటీస్లో దుర్గగుడి అధికారుల నిర్వాకం బయటపడింది. తాజాగా దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం నిర్మించిన డార్మెటరీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. దుర్గగుడి తరుపున వన్టౌన్లోని సీవీ రెడ్డి ఛారిటీస్లో ఈ డార్మెటీరీలను నిర్మించారు. ఉచిత డార్మెటరీలతో పాటు ఏసీ డార్మెటరీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలు ఉండే రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతోంది. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
అయితే వివాదం గురించి తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు అక్కడికి చేరుకున్నారు. మహిళల గదుల్లో సీసీ కెమెరాలు అమర్చడం పొరపాటేనని అంగీకరించారు. ఇవాళే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని తొలగించడంతో పాటు బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని అధికారుల దృష్టికి కొద్దిరోజుల క్రితమే తీసుకెళ్లామని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు.