డబ్లిన్, జూన్ 29 : భారత్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్తో భారత్ రెండు టీ20లు ఆడుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సిరీస్లో చివరిదైన రెండో టీ20 ఈ రోజు జరగనుంది. ప్రస్తుత జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లు ఐర్లాండ్లో పర్యటించడం ఇదే మొదటిసారి. దీంతో ఖాళీ సమయంలో ఆటగాళ్లు సహచరులతో కలిసి డబ్లిన్ వీధుల్లో షికార్లు చేస్తున్నారు. తొలి మ్యాచ్ అనంతరం కాస్త ఖాళీ దొరకడంతో సందర్శన ప్రదేశాలను చుట్టేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో టీమిండియా ఆటగాళ్ల ఫొటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. 'డబ్లిన్లో అందమైన రోజు' అంటూ పాండ్య, ధావన్తో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ షేర్ చేసుకున్నాడు. అలాగే ధావన్, బుమ్రా కూడా ఐర్లాండ్లో తాము గడుపుతోన్న క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సిరీస్ తర్వాత అటు నుండి ఇంగ్లాండ్తో భారత్ టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది.