ముంబై, జూలై 10 : ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్ను ప్రారంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే ప్రయాణాలకుగాను నేటి నుంచి జులై 13వ తేదీ వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
సంస్థ అధికార ప్రతినిధి విలియమ్ బౌల్టర్ మాట్లాడుతూ 'ఇండిగో ఎయిర్లైన్స్ స్ధాపించి 2018 ఆగస్టు 4కి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నాం. ప్రారంభ ధర రూ.1,212 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మొత్తం 12 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాం. ఇండిగో సేవలందిస్తున్న అన్ని మార్గాల్లో ప్రయాణించేవారు ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చ’ని వ్యాఖ్యానించారు.