ధర్మారం(పెద్దపల్లి), జూలై 13 : గుత్తేదారులు, అధికారులతో కలిసి శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్రావు ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు చివరి వారంలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మేడారంలోని ఒక పంపు ద్వారా చెరువులోకి ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తామన్నారు. తద్వారా కాళేశ్వరం పథకం మొదటి పంపు ఎత్తిపోతలు ప్రారంభించినట్లవుతుందని అన్నారు. మేడారం పంపుహౌజ్లోని ఏడు పంపులకు గాను రెండు పంపుల బిగింపు పూర్తి అయ్యిందని, మరో రెండు పంపుల బిగింపు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.
తమ్మిడి హట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం అవివేకమని.. అక్కడ నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం ఈ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క అనుమతి కూడా సాధించలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులూ సాధించిందని చెప్పారు. ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీటిని రైతులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.