కన్నీటి పర్యంతమైన కుమారస్వామి..

     Written by : smtv Desk | Sun, Jul 15, 2018, 12:33 PM

కన్నీటి పర్యంతమైన కుమారస్వామి..

కర్ణాటక, జూలై 15 : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి అయినందుకు కార్యకర్తలంతా ఆనందంగా ఉన్నారని, కానీ, సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో తాను మాత్రం చాలా బాధతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ సన్మాన కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను" అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి కుమారస్వామి నిరాకరించారు.

మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి మా సీఎం కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొడుగు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కుమారస్వామిపై ఓ వీడియో పోస్ట్ చేశారు. జిల్లాలో రోడ్లు కొట్టుకుపోయినా సీఎంకు ఏ మాత్రం చింతలేదని అందులో విమర్శించాడు. అలాగే తమ రుణాలను మాఫీ చేయడంలో కుమారస్వామి విఫలమయ్యారని కోస్తా జిల్లాల మత్స్యకారులు మండిపడుతున్నారు.

దీనిపై స్పందించిన ఆయన... 'సోషల్‌ మీడియాలో పోస్టులు నన్ను బాధిస్తున్నాయి. రుణమాఫీ గురించి అధికారులతో ఎంతగా వాదులాడానో మీకేం తెలుసు. అన్నభాగ్య స్కీమ్‌ కింద 5 కిలోల బియ్యం బదులు, ఏడు కిలోల బియ్యం అడుగుతున్నారు. అదనంగా రూ. 2500 కోట్లు ఖర్చవుతుంది. అదంతా ఎవరు భరిస్తారు. పోనీ టాక్స్‌ల రూపంలో వసూలు చేద్దామా? అంటే తిరిగి ప్రభుత్వానే విమర్శిస్తారు. మీరైతే రుణమాఫీ విషయంలో సీఎంకే స్పష్టత లేదంటూ కథనాలు ప్రచురిస్తున్నారు' అంటూ మీడియాను ఉద్దేశించి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు.





Untitled Document
Advertisements