దేవుడి ముందు కూడా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 07:31 PM

దేవుడి ముందు కూడా అబద్దాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు

* ఒక్క బ్రాహ్మణుడికి కూడా టీడీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదు

* దేవాలయ కాంట్రాక్టు పనులను బందువులకు ఇచ్చారు.

* సిరిపురంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో వైఎస్‌ జగన్‌

సిరిపురం :సిరిపురంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలీలో విమర్శించాడు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే అందినకాడికి దోచుకుంటారన్నారు. రాజధాని నిర్మాణమని భూములను దోచుకోవడమే కాకుండా రైతులకు అన్యాయం చేశారన్నారు.

‘‘గత ఎన్నికల సమయంలో ప్రతి పేద బ్రాహ్మణులకు చంద్రబాబు ఐదు వేలు ఆర్థిక సహయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల గడిచినా ఇంతవరకూ ఆ హామీని అమలు చేయలేకపోయారు. గతంలో చంద్రబాబు పూజారులకు పదవీ విరమణ వయసు లేకుండా చేస్తామన్నారు. కానీ రమణ దీక్షితుల్ని అన్యాయంగా పదవి నుంచి తొలగించి ఇంటికి పంపించారు. నామినేటెడ్‌ పోస్టుల్లో బ్రాహ్మణులు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు.

బ్రాహ్మణులకు కనీసం ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదు. దేవాదాయ ఆస్తులను పరిరక్షిస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోని నేతలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను దోచుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన కోట్లు విలువ చేసే పదకొండువందల ఎకరాల భూమిని సిద్ధార్ధ అనే ప్రైవేటు కాలేజీకి కేవలం లక్ష రూపాయాలకే కట్టబెట్టారు’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలోని బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. కుల, మతాలు అనే తేడా లేకుండా అందరికి ఉచిత విద్య అందిస్తామన్నారు.





Untitled Document
Advertisements