ప్రకాశం జిల్లాఅక్టోబర్ 03: ఆస్తులు, ప్రతిష్ట కన్నా ప్రాణాలు ఏమంత ముఖ్యం కావడంలేదు మనుషులకు ? పొలం తనకు అమ్మలేదన్న కోపంతో ఓ అన్న,చెల్లిని నడిరోడ్డుపై నరికి చంపాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్వర్ణ గ్రామానికి చెందిన సొద రాధాకృష్ణమూర్తి, రాజారావు అన్నదమ్ములు. పెద్దవాడైన రాధాకృష్ణకు నలుగురు కుమార్తెలు. రాజారావుకు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణకు చెందిన ఎకరం పొలం విషయంలో రాజారావు కుమారుడు సింగయ్యతో వివాదం నడుస్తోం ది.
పొలం తనకే అమ్మాలని సింగయ్య(40) (పెద్దనాన్న కొడుకు) పట్టుబడుతూ గొవడపడేవాడు. దీంతో కక్ష పెంచుకున్న సింగయ్య ఆ పొలాన్ని ఎవరూ కొనకుండా అడ్డుపడ్డాడు. అంతేకాకుండా ఇంటివద్ద మురుగునీరు విషయంలో రాధాకృష్ణ నాలుగో కుమార్తె పద్మావతితో సింగయ్యకు గొవడ అయింది. అయితే ఇటీవలే రాధాకృష్ణ తన పొలాన్ని అమ్మేసి తన నాలుగో కుమార్తె పద్మావతికి పెళ్లి చేశాడు. ఆమె భర్తతో కలిసి హైదరాబాద్లో ఉంటోంది.
పద్మావతి సోషల్ వర్క్లో పీజీ చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ప్రభుత్వ అధికారుల ప్రశంసలు పొందింది.
మంగళవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులో అవార్డు స్వీకరించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమె మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒంగోలు వెళ్లేందుకు స్వర్ణలో బస్షెల్టర్ వద్దకు వస్తుండగా అక్కడే మాటు వేసిన సింగయ్య ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఛాతీకింద, మెడపైన సుమారు 10 చోట్ల ఆమెను కిరాతకంగా నరికాడు. దీంతో పద్మావతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పారిపోయేందుకు యత్నించిన సింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.