అనంతపురం, డిసెంబర్ 6: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు నిజంగానే తిక్క ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. పవన్ ప్రొద్దున మాట్లాడిన విషయాలను రాత్రికి మర్చిపోతారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం విషయంలో పవన్ మాట నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గోట్లూరులో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేస్తానని జనసేనాని ప్రకటించారు. కానీ కేంద్రం ప్రభుత్వం హోదా ఇవ్వకపోయినా పవన్ కల్యాణ్ నోరు మెదపడంలేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి మరోసారి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా ఓ రైతు అమరావతి నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు.