బెంగుళూరు, జనవరి 4: శాండల్ వుడ్ సినీ పరిశ్రమలో ప్రముఖులపై ఐటీ శాఖ నిన్న దాడులు నిర్వహించింది. కన్నడలో పలు హిట్ చిత్రాలు తెరకెక్కిన నేపథ్యంలో నటీనటులు, నిర్మాతలు అందుకు అనుగుణంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ అధికారులు నిన్న కర్ణాటకలోని 23 చోట్ల తనిఖీలు చేపట్టారు. నిర్మాత రాక్లైన్ వెంకటేశ్, నటులు యశ్, పునీత్ రాజ్కుమార్, శివ రాజ్కుమార్, సుదీప్ తో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక ఇంటిపై సైతం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అధికారులు విలువైన పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ ఐటీ దాడులపై కేజీఎఫ్ నటుడు యశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకేం భయం లేదు. ఐటీ దాడులకు భయపడను. నేనే తప్పూ చేయలేదు. ఐటీ అధికారులను వారి పనిని చేసుకోనివ్వాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలకు రావొద్దు’ అని తెలిపాడు. మరోవైపు కిచ్చ సుదీప్ మాట్లాడుతూ.. ‘ఐటీ దాడుల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని వెల్లడించాడు.