హైదరాబాద్, జనవరి 5: 2019 సంక్రాంతికి థియేటర్ల దగ్గర సందడి ఒక రేంజ్ లో కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ 'కథానాయకుడు' .. రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' .. వెంకటేశ్ 'ఎఫ్ 2' వరుసగా థియేటర్లలోకి దిగనున్నాయి. వీటితో పాటు సూపర్ స్టార్ రజని కాంత్ 'పెట్ట' కూడా పోటీపడనుంది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంగా 'కథానాయకుడు', యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చరణ్ మూవీ, పూర్తి వినోద భరిత చిత్రంగా 'ఎఫ్ 2', పూర్తి యాక్షన్ నేపథ్యంలో 'పెట్ట' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
రామ్ చరణ్ ఇంతకుముందు చేసిన 'రంగస్థలం' పెద్ద హిట్ కావడంతో, ఈ మూడు సినిమాల్లో చరణ్ సినిమా పట్ల ఎగ్జిబిటర్లు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఈ కారణంగా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కనున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ బరిలో నిలిచే సినిమాలో ఉండవలసిన మాస్ మసాలా కంటెంట్ ఈ సినిమాలో ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాలు భిన్నమైన జోనర్లకి సంబంధించినవి కావడంతో, అన్ని సినిమాలకి మంచి వసూళ్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.