అమరావతి, జనవరి 7: మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీనం పై పలు కార్యకర్తలు, నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ విలీనంపై తన పార్టీ నేతలతో చర్చించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజారాజ్యం పార్టీ విలీనం పై టీడీపీ నేత ఆరీఫుల్లా సంచలన ఆరోపణలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారణం మాజీ మంత్రి రామచంద్రయ్యే అని ఆయనకు అధికారదాహం ఎక్కువ అని ఆరోపించారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించారని, ప్రస్తుతం మోదీ మార్గదర్శకత్వంలో వైసీపీలో చేరి ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అందుకు ప్రతిఫలంగా బీజేపీ రాజ్యసభ కుర్చీని ఆఫర్ ఇచ్చినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రామచంద్రయ్యకు రాజకీయ గుర్తింపు ఉందంటే అది చంద్రబాబు చలువేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముక్తియార్, రాజగోపాల్, షామీర్బాష, సునీల్ కుమార్ పాల్గొన్నారు.