ముంబై, ఫిబ్రవరి 15: బాలీవుడ్ లో ప్రేమకథలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్ధం కాదు. కొందరు పెళ్లి చేసుకొని తమ ప్రేమను ముందుకు తీసుకు వెళ్తే, మరికొందరు బ్రేక్ అప్ అంటూ విడిపోతుంటారు. ఇంకొంత మంది తమ అనుబంధాన్ని సీక్రెట్ గా ఉంచాలని ప్రయత్నిస్తారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో పాపులర్ ప్రేమ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తుంది. అయితే వీరు మాత్రం తమ సంబంధం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
తాజాగా వీరిద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 'గల్లీ బాయ్' స్పెషల్ స్క్రీనింగ్కి హాజరైన వీరిద్దరు కారులో గొడవ పడ్డ వీడియో వైరల్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం చెడిందని అందరు భావించారు. అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆలియా, రణబీర్ ఇంటికి వెళ్లి ఆయన పర్సనల్ చెఫ్ హరీష్ దీక్షిత్ తయారు చేసిన వ్యాలంటైన్ డిన్నర్ తిన్నారు.
ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోను చెఫ్ హరీష్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీన్ని బట్టి రణబీర్, ఆలియా మద్య ఎలాంటి మనస్పర్థలు లేవని వారు ఆనందంగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.