త్రివిక్రమ్ ఒకటంటే అల్లు అర్జున్ మరోటి అంటున్నాడా?

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 11:55 AM

త్రివిక్రమ్ ఒకటంటే అల్లు అర్జున్ మరోటి అంటున్నాడా?

హైదరాబాద్, ఫిబ్రవరి 15: అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకొని, సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాకి కథ సిద్ధం అయిపోగా ఇప్పుడు నటీనటులపై దృష్టి పెట్టారు.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించే కథానాయిక ఎవరనేది ఇంకా తేలలేదు. ముందుగా మలయాళం బ్యూటీ రష్మికను హీరోయిన్ గా అనుకున్నారని సమాచారం. అయితే అది నిజం కాదని తేలిపోయింది.

చిత్ర బృందం ఇంకా హీరోయిన్ ఎవరనేది నిర్ణయించలేదు. అయితే ఇప్పుడు తాజాగా కైరా అద్వానీ, పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కైరా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ ఆమెకు డేట్స్ ఖాళీ లేనందున పూజ హేగ్దేని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారు.

పూజ హెగ్డే తో ఇప్పటికే 'దువ్వాడ జగన్నాథం' సినిమా చేసినందున కైరా అయితే కొత్తగా ఉంటుందని అల్లు అర్జున్ చెప్పాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం పూజని తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరికి ఎవరు ఈ లక్కీ ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి మరి.

కాగా హీరోయిన్ ని రిపీట్ చేయడం త్రివిక్రమ్ కి కొత్తేం కాదు. గతంలో కూడా సమంతని మూడు సార్లు రిపీట్ చేశారు. అయితే, ఇప్పుడు అదే మాదిరిగానే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని కైరా అద్వానీ కంటే కూడా పూజ హెగ్దేని తీసుకునే అవకాశమే ఎక్కువ అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.





Untitled Document
Advertisements