అమెరికా, ఫిబ్రవరి 15: కాశ్మీర్ లోని పుల్వామలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరవీరులుగా మరణం పొందడంతో...ఈ ఘటనపై ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇంతటి మారణహోమానికి తామే కారణమంటూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది.
అంతేకాకుండా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది వీడియోను సైతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, వారికి ఆర్ధికంగా, ఆయుధపరంగా సాయం చేస్తోంది.
ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలియడంతో అగ్రరాజ్యం అమెరికా పాక్ పై తీవ్ర స్థాయలో ధ్వజమెత్తింది. ఇకనైనా ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపేయాలంటూ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. దాడి తర్వాత వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు.
ఉగ్రవాదులను అన్ని విధాలా కాపాడుతూ.. వారికి సాయం చేస్తూ పాక్ ముష్కరులకు స్వర్గంలా భాసిల్లుతోందని.. అటువంటి చర్యలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నపళంగా నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు.