న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పుల్వామా దాడి జరిగిన తరువాత ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్ తో ఇండియా ఆడే మ్యాచ్ లఫై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్వామా దాడితో దాదాపు తెగిపోయిందని, దశాబ్దకాలంగా పాకిస్థాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడనప్పటికీ ఆసియా కప్, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్ తలపడుతోంది. కానీ.. తాజాగా ఉగ్రదాడితో ఆ బంధానికి కూడా తెరపడే అవకాశముందని చెప్పుకొచ్చారు. ఇక మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలుకానున్న సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్ను బహిష్కరించి వరల్డ్కప్ వేదికగా పాక్ దుశ్చర్యని ప్రపంచానికి తెలియజేయాలని టీమిండియాకి అభిమానులు సూచిస్తున్నారు. మరోవైపు ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కార్యాలయంలోని గ్యాలరీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదాని కప్పి ఉంచగా.. పంజాబ్లోని మొహాలి స్టేడియంలోని పాక్ మాజీ క్రికెటర్ల ఫొటోల్ని తొలగించారు. పుల్వామా దాడి ఘటనపై తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘పాకిస్థాన్తో క్రికెట్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి నేను ఒకటే చెప్తుంటాను.
రాజకీయాలు, స్పోర్ట్స్ వేర్వేరని.. కానీ.. తాజా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా, మొహాలిలో పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగించడం సరైన నిర్ణయమే. ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలేసే వరకూ పాక్తో క్రికెట్ గురించి చర్చలు జరపబోం. ఇక ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని రాజీవ్ శుక్లా వెల్లడించాడు.