అమరావతి, ఫిబ్రవరి 19: నేడు అమరావతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వైసీపీ తరుపున గుంటూరు ఎంపీ స్థానానికి పోటీచేయనున్నారనే విషయంపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు తెలియదు... నేను వైసీపీలో లేను.. హైదరాబాద్ లో లేను కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేను’ అని అన్నారు. కాగా నాగార్జున ఒకవేళ గుంటూరు నుంచి మీపై పోటీ చేస్తే..’ అనే ప్రశ్నకు గల్లా స్పందిస్తూ.. ‘ఆయన వస్తాడని నేను అనుకోవట్లేదు. నేను, నాగార్జున మంచి ఫ్రెండ్స్. ఆయన ఏదైనా చేసేట్టయితే, నాతో మాట్లాడి చేస్తారు కాబట్టి, నేను నమ్మను’ అని అన్నారు.
కాగా అక్కినేని నాగార్జున ఈరోజు వైసీపీ అధినేత జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాగార్జున వైసీపీలో చేరినట్లు, గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారన్న ప్రచారం జోరు సాగుతుంది. జగన్ తో నాగార్జున భేటీ కావడంపై రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది.