హైదరాబాద్, మార్చ్ 11: రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా ముఖ్యమంత్రి కెసిఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరిస్తారని అశించామని, కానీ తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా వికార, వికృత చేష్టలకు అయన పాల్పడ్డారని మండిపడ్డారు. తమకున్న బలం ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును గెలవాల్సి ఉంది కానీ కెసిఆర్ తీరుతో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యంపాలయిందని అన్నారు. కెసిఆర్ తీరును నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు.