ముంబై, మార్చ్ 18: ఆభరణాలు, గడియారాల సంస్థ టైటాన్ షేరు గత ట్రేడింగ్ సెషన్ రోజున రూ.1113ను అధిగమించి మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల మార్కుకు చేరనుంది. తర్వాతి ట్రేడింగ్ సెషన్లో టైటాన్ ఈ క్లబ్లోకి చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుతం టైటాన్ మార్కెట్ క్యాప్ రూ.97212కోట్లు. మన దేశంలో ట్రిలియన్ మార్క్ క్లబ్లోకి చేరిన లిస్టెడ్ సంస్థలు 27 మాత్రమే ఉన్నాయి. కాగా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ 41.6శాతం వృద్ధిని నమోదు చేయడంతో రూ.416కోట్లకు చేరింది. దీనికి కారణం జ్యుయెల్లరీ సెగ్మెంట్ పనితీరు మెరుగ్గా ఉండడమే. ఈ సెగ్మెంట్ ఏకంగా 37 శాతం వృద్ధిని నమోదు చేసింది. టైటాన్సంస్థ తీసుకున్న రుణాలను క్రిసిల్ సంస్థ పాజిటివ్ ఔట్లుక్ ఇచ్చింది. సంస్థ ఇకపై కూడా మెరుగైన పనితీరును కనబరచవచ్చని క్రిసిల్ విశ్లేషిస్తోంది. గత రెండేళ్లుగా టైటాన్ జ్యుయెల్లరీ సెగ్మెంట్లో స్టోర్లను పెంచుకుంటూ వస్తోంది. ఏటా 10నుంచి 20 స్టోర్లకు బదులు 30నుంచి 40 స్టోర్ల చొప్పున విస్తరిస్తోంది.