శ్రీవారి కోవెలలో శ్రీలంక అధ్యక్షుడు

     Written by : smtv Desk | Wed, Apr 17, 2019, 02:39 PM

శ్రీవారి కోవెలలో శ్రీలంక అధ్యక్షుడు

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాన్నికి బుధవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులతో కలిసి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసేన కుటుంబానికి, అధికారులకు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.సిరిసేన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కి అనంతరం బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారి గర్భాలయ బయట నిలబడి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత దర్శనం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారికి కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు మైత్రిపాల‌ దంపతులకు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను , శ్రీవారి శేష వస్త్రాలను అందించారు. అనిల్, శ్రీనివాస రాజులు శ్రీ పద్మావతి సమేత శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను సిరిసేన దంపతులకు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం అధ్య‌క్షుడు త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ పద్మావతి అధితి గృహానికి చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి సిరిసేన బృందం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.





Untitled Document
Advertisements