భారత్ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోని ఒకడు

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 09:57 AM

భారత్ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోని ఒకడు

ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సేవలు జట్టుకు చాలా కీలకమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. జట్టులో ధోనిలాంటి క్రికెటర్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ధోని చాలా విలువైన క్రికెటరన్నాడు. అతని ప్రతిభను వెలకట్టలేమన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌లో ధోని ముఖ్య భూమిక పోషించడం ఖాయమన్నాడు. ఇటీవల కాలంలో కొందరు పనిగట్టుకుని ధోనిని విమర్శిస్తున్నారని, ఇది మంచిది కాదని కోహ్లి హితవు పలికాడు. భారత్ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోని ఒకడన్నాడు. అతని సామర్థాన్ని శంకించడం తగదన్నాడు. భారత్‌కు చిరస్మరణీయ సేవలు అందించిన ఘనత అతనికే దక్కుతుందన్నాడు. తనతో పాటు చాలా మంది క్రికెటర్లకు ధోనినే స్ఫూర్తి అనడంతో సందేహం లేదన్నాడు. ధోనిలాంటి క్రికెటర్‌తో కలిసి ఆడడాన్ని గర్వంగా భావిస్తున్నానని కోహ్లి స్పష్టం చేశాడు. ధోనితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, తాము మంచి స్నేహితులమని పేర్కొన్నాడు.

ఇక, ప్రపంచకప్‌లో ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో దిగడం ఖాయమన్నాడు. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టుపై పూర్తి సంతృప్తితో ఉన్నట్టు కోహ్లి చెప్పాడు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ ప్రతిభావంతులేనన్నాడు. ఇప్పటికే తామెంటో నిరూపించారన్నాడు. వీరి ఆటపై సందేహించాల్సిన అవసరం లేదన్నాడు.





Untitled Document
Advertisements