కరీంనగర్ నగరపాలక సంస్థ ఆసక్తికర ప్రకటన చేసింది. నగరపాలక సంస్థకు ఒక్క రూపాయి చెల్లిస్తే అంత్యక్రియలు నిర్వహిస్తామని మేయర్ రవీందర్ సింగ్ ప్రకటించారు. కరీంనగర్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలదేనని, ఇందులో భాగంగానే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్టు వివరించారు.
నగర పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ సదుపాయం వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, రూ.1.50 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రెండు ప్రత్యేక వాహనాలు , ఒక ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నామని, జూన్ 15 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మృతదేహాన్ని ఇంటి వద్ద నుంచి శ్మశాన వాటికకు తరలించే వాహనం, దహన సంస్కారాలు, ఇతర ఏర్పాట్లన్నింటినీ నగరపాలక సంస్థే భరిస్తుందని అన్నారు.