కార్లు, టూవీలర్లు, రవాణా వాహనాలకు సంబంధించిన థర్డ్ పార్టీ (టీపీ) బీమా ప్రీమియం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రీమియం రేట్ల పెంపును బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. దీని ప్రకారం.. 1000 సీసీకన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన కార్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమి యం రేట్లను రూ.1,850 నుంచి రూ.2,120కి పెంచాలని ప్రతిపాదించింది. 1,000-1,500 సీసీ మధ్యన ఉండే కార్ల ప్రీమియం పెంపు ప్రతిపాదన రూ.3,300గా ఉంది.
ఇంతకు ముందు ఇది రూ.2,863గా ఉండేది. అయితే 1,500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన లగ్జరీ కార్ల థర్డ్ పార్టీ ప్రీమియంను మాత్రం మార్చలేదు. ప్రస్తుతం ఈ ప్రీమియం రూ.7,890గా ఉంది. 75 సీసీకన్నా తక్కువ ఉన్న టూవీలర్ల ప్రతిపాదిత టీపీ రూ.427 నుంచి రూ.482కు చేరింది. 75సీసీ నుంచి 350 సీసీ మధ్య ఉన్న బైకుల ప్రీమియంను పెంచాలని ప్రతిపాదించారు. సూపర్ బైకులకు (350 సీసీ ఎగువన) మాత్రం రేట్ల పెంపును ప్రతిపాదించలేదు.
సాధారణంగా టీపీ రేట్లను ఏప్రి ల్ ఒకటో తేదీ నుంచి సవరిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పాత రేట్లు కొనసాగుతాయని ఐఆర్డీఏఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టీపీ ప్రీమియం కొత్త రేట్ల ముసాయిదాను విడుదల చేసిన ఐఆర్డీఏఐ.. ప్రతిపాదిత రేట్లపై అన్నివర్గాల వారు మే 29 వరకు అభిప్రాయాలను తెలియజేసే అవకాశాన్ని కల్పించింది.
ఇదిలా ఉంటే.. కొత్త కార్లు, టూవీలర్లకు సంబంధించిన సింగిల్ ప్రీమియం రేట్ల (కార్లకు మూడేళ్లు, బైకులకు ఐదేళ్లు)లో ఎలాంటి మార్పు లేదు. ఎలక్ర్టిక్ ప్రైవేటు కార్లు, ఎలక్ర్టిక్ టూవీలర్ల మోటార్ టీపీ ప్రీమియం రేట్లకు 15 శాతం డిస్కౌంటు ఇవ్వాలని ఐఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ-రిక్షాల టీపీ ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పులను ప్రతిపాదించలేదు.
అయితే స్కూల్ బస్సుల బీమా రేటు పెరిగే అవకాశం ఉంది. టాక్సీలు, బస్సులు, ట్రక్కులకు సంబంధించిన బీమా పెంపును ప్రతిపాదించారు. ట్రాక్టర్ల బీమా ప్రీమియం కూడా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీఐ) 2011-12 నుంచి 2017-18 వరకు క్లెయిమ్ల చెల్లింపులకు సంబంధించి ఇచ్చిన డేటాకు అనుగుణంగా మోటార్ టీపీ ప్రీమియం రేట్లను ప్రతిపాదించినట్టు ఐఆర్డీఏఐ పేర్కొంది.