మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

     Written by : smtv Desk | Sun, May 26, 2019, 05:35 PM

 మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఓటమి తర్వాత చాలా రోజులకి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అభిమానులు ఆదివారం గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో నారా లోకేష్‌ను కలిశారు. మాజీమంత్రి కొత్తప‌ల్లి జ‌వ‌హ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్, ఆదిరెడ్డి అప్పారావు త‌దిత‌రులు లోకేష్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ప్రజా తీర్పును గౌరవిద్దామనీ, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవి, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ మీతో నా అనుబంధాన్ని మార్చలేవు.

మంగళగిరి నియోజకవర్గం నా ఇల్లు మీరంతా నా కుటుంబం అని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదు. గడప గడపకు వచ్చాను, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని చెప్పా. ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మాత్రం మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది. ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ అవ్వాలి. ఎన్నికలలో మీరు నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements