ఎన్నికలు ముగిసినా కొన్ని చోట్ల రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొందరు బహిరంగ కొట్లాటలకు దిగుతుంటే ఇంకొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా జనసేన అభ్యర్ధి ఒకరికి వస్తున్న హత్య బెదిరింపులు చూస్తుంటే ఈ సంగతి అర్థమవుతోంది. గడిచిన ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి జనసేన తరపున నాగ సందీప్ పంచకర్ల పోటీచేసి ఓడిపోయారు. ఈ స్థానం నుండి వైకాపా అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస రావు గెలుపొందగా సందీప్ 24 వేల పైచిలుకు ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.
ఇలా ఎన్నికలు పూర్తయ్యాయి లేదో సందీప్ పంచకర్లకు హత్యా బెదిరింపులు మొదలయ్యాయట. ఇకపై జనసేన పార్టీలో కొనసాగినా, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసినా చంపుతామని, ఆయన తల్లిని చిత్రహింసలకు గురిచేస్తామని కొందరు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారట. దీంతో సందీప్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి పిర్యాదు చేశారు. అంతేకాదు ఏది ఏమైనా తమ నాయకుడు చెప్పినట్టు పోరాడతామని బల్లగుద్ది చెప్పారు.