నార్వే: నార్వే ప్రతిపక్ష నేత గైడో ఇప్పుడు దౌత్య మార్గానికి మళ్లారు. ఈయన గత కొంత కాలంనుండి వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దింపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ వారంలో నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా జరిగే ఈ చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని ఇటు మదురో, అటు గైడో ధ్రువీకరించారు. ఇరువురి మధ్య చర్చలకు రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ప్రయత్నం కావటం గమనార్హం. మదురో ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు, గైడో సన్నిహితులు ఇప్పటికే ఓస్లో నగరానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మదురో-గైడో మధ్య చర్చలకు తాము ఆతిథ్యం ఇవ్వనున్నట్టు నార్వే ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరువురు నేతలూ తమ ప్రతినిధులను పంపనున్నట్టు ప్రకటించటం గమనార్హం. మదురో, గైడో ప్రతినిధులు ఇప్పుడు రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్నట్టు నార్వే అధికార మీడియా వెల్లడించటం, వీరి మధ్య మరో విడత చర్చలకు అవకాశముందన్న భావనకు తావిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. తమ దేశంలో శాంతి పునరుద్ధరణకు నార్వే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అధ్యక్షుడు మదురో కృతజ్ఞతలు తెలియచేశారు. ఓస్లో నగరానికి బయల్దేరిన తమ ప్రతినిధి బృందం సమగ్రమైన ఎజెండాతో కలిసి పనిచేసేందుకు, తగిన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు.